కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించలేదన్నారు. కానీ ప్రధాని మోడీని ప్రశంసించడం, టీఆర్ఎస్కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పడం ద్వారా కోమటిరెడ్డి చూపంతా కమలం వైపే వున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీలో చేరే అంశంపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎలాంటిదైనా మీడియా ముఖంగానే ప్రకటిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వుండొచ్చునని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ పోటీచేస్తానని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీని తానెప్పుడూ విమర్శించలేదని కోమటిరెడ్డి గుర్తుచేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోందని... టీఆర్ఎస్పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడిందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తం మీద బీజేపీలో చేరుతానని ఆయన చెప్పనప్పటికీ.. ప్రధాని మోడీని ప్రశంసించడం, టీఆర్ఎస్కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పడం ద్వారా కోమటిరెడ్డి చూపంతా కమలం వైపే వున్నట్లుగా తెలుస్తోంది.
అంతకుముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన రాజీనామాను స్పీకర్ త్వరగా ఆమోదించాలని.. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి, ఎమ్మెల్యేగా కొనసాగడం నైతికం కాదన్నారు. రేపో , ఎల్లుండో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బాధతో రాజీనామా చేశానని.. బయటి నుంచి వచ్చిన వ్యక్తిని సీఎంని చేయాలా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. తాను తప్పు చేశానంటే ఏ చర్చకైనా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. తన పదవీ త్యాగంతోనైనా కేసీఆర్ కళ్లు తెరవాలని కోమటిరెడ్డి చురకలు వేశారు. డబ్బుల కోసం పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్లో వున్న తాము పనిచేయాలా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోనే తనకు అవమానం జరిగిందని కోమటిరెడ్డి తెలిపారు. 20 ఏళ్లు సోనియాను తిట్టిన వ్యక్తిని పీసీపీగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కింద మమ్మల్ని పనిచేయమంటున్నారని... ఇంతకన్నా అవమానం వుందా అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
జాతీయ నాయకత్వం బలహీనపడటం వల్ల కాంగ్రెస్లో వుండి కూడా ఏమీ చేయలేకపోయానని ఆయన అన్నారు.
తన జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవారు వున్నారని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్ల కోసం తాను రాజీనామా చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరగొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో ఎవరు గెలవాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
