రెండేళ్లుగా దానం..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ పై సంచలన వ్యాఖ్య
మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారడంలో ఆశ్చర్యం లేదని కాంగ్రెసు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారడంలో ఆశ్చర్యం లేదని కాంగ్రెసు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. అదే సమయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ అధికారంలోకి రాదని, పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని ఆయన అన్నారు. శనివారం మీడియాతో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఉత్తమ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వైఎస్, రాహుల్ గాంధీలతో తనను పోల్చుకుంటున్నాడని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయన ఎవరని ఆయన ప్రశ్నించారు.
దానం షో పుటప్ వ్యక్తి అని, ఆయన పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ కలిగే నష్టమేమీ లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జులైలో పార్టీ ప్రక్షాళన ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్పారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకుంటుందని చెప్పారు.
పార్టీలో ఎనమని గ్రూపులున్నా అధైర్యపడవద్దని, ఎవరూ పార్టీని వీడవద్దని ఆయన అన్నారు.