రాహుల్తో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యేక భేటీ
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో రాహుల్ గాంధీ సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి సోదరులు రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు.1999 నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న నల్గొండ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేయనున్నారు.మరోవైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది నేతలు శుక్రవారం నాడు న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పొత్తులు... అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితితో పాటు టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అవలంభించాల్సిన పరిస్థితులపై ఈ సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ తో చర్చించారని సమాచారం.
అయితే బలమైన అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించాలని కోమటిరెడ్డి సోదరులు రాహుల్ ను కోరినట్టు సమాచారం. మరోవైపు పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన యువలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు సూచించారని తెలుస్తోంది.