బిజెపితో ఆ విషయాలే మాట్లాడా: కోదండరామ్
బిజెపితో తాను పొత్తు కోసం చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ జన సమితి (టీజెఎస్) నేత కోదండరామ్ స్పందించారు. మహా కూటమి నుంచి తాను వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: బిజెపితో తాను పొత్తు కోసం చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ జన సమితి (టీజెఎస్) నేత కోదండరామ్ స్పందించారు. మహా కూటమి నుంచి తాను వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన మాట్లాడారు. అపోహలు సృష్టించడం వెనక ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) హస్తం ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఐటీ, ఈడీలను ప్రభుత్వం స్వార్థానికి వాడుకుంటోందని కోదండరాం ఆరోపించారు. కేసీఆర్ సహా ఇంకా చాలా మంది ఇళ్లలో ఐటీ సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిస్థితిపై కిషన్రెడ్డితో అసెంబ్లీ రద్దుకు ముందు చర్చించానని, టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణపై బిజెపితో తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన శనివారం మీడియాతో చెప్పారు. మరో కూటమి ఏర్పాటు కోసం చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మొదటి దశలో మహా కూటమి మేనిఫెస్టోపై, రెండో దశలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ కోసమే తాము వ్యూహాత్మకం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. అమరవీరుల ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో తయారవుతోందని, ముసాయిదా మేనిఫెస్టోపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.
అక్టోబర్ 3వ తేదీ నుంచి తన పోరు యాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. రేపపు మహబూబ్ నగర్ లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.
సంబంధిత వార్త
మహా కూటమికి షాక్: బిజెపి వైపు కోదండరామ్