అది తెలంగాణ ‘జల్లికట్టు’ కానుందా !
జల్లికట్టు స్ఫూర్తి మన యువతలోనూ ఉందా అనేది తెలియాలంటే 22\2 వరకు ఆగాల్సిందే.
లక్ష ఉద్యోగాలు కాకి ఎత్తుకపోయిందా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం జల్లికట్టు స్ఫూర్తితో ఈ నెల 22 న నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ఉద్యమ సమయంలో సాగరహారాన్ని ఒంటిచేత్తో భారీ స్థాయిలో సక్సెస్ చేసిన టీ జేఏసీ కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరస ర్యాలీని విజయవంతం చేయడం అంత సులువు ఏం కాదు.
నాడు జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రతీ పార్టీ, ప్రతి ఉద్యమకారుడు కలసి వచ్చి జేఏసీ పిలుపును అందుకొని సాగరహారాన్ని విజయవంతం చేశారు. పోలీసుల ఆంక్షల మధ్య కూడా పట్టువదలకుండా నెక్లెస్ రోడ్డు లో తెలంగాణ గళాన్ని వినిపించి సాగరహారాన్ని చరిత్రలో నిలిపారు.
ఈ విజయం వెనక ప్రొ.కోదండరాం, టీ జేఏసీ నేతల కృషి ఎంతో ఉంది. రాత్రిపగలు తేడా లేకుండా నెల రోజులకంటే ముందే ప్రతీ ఊరు,వాడ కదిలేలా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు సాగారహారానికి వచ్చేలా ప్రయత్నించారు.
కానీ, ఇప్పుడు నిరుద్యోగ నిరసర్యాలీ పరిస్థితి వేరు... నాడు సాగరహారానికి మద్దతిచ్చి ముందున్న పార్టీనే ఇప్పుడు ఈ ర్యాలీకి పూర్తి వ్యతిరేకం. ఇక ఇతర పార్టీల పరిస్థితి సరేసరి.
అయినా కూడా ఈ ఉద్యమం సాగరహారం తరహాలో విజయవంతం అయ్యేలా చేసేందుకు టీ జేఏసీ జల్లికట్టు స్ఫూర్తితో ముందుకు వెళుతోంది. సాగరహారం సమయంలో చేసిన ఇంటింటి ప్రచారాన్ని ఈ సారి పక్కన పెట్టింది.
అడుగు బయటపెట్టకుండానే వేలాది మంది నిరుద్యోగులను సమీకరించే సరికొత్త ప్రయత్నాన్ని టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ప్రారంభించారు.
సోషల్ మీడియా ఆయుధంగా ఆయన ఈ సరికొత్త ప్రచారానికి తెర లేపారు. ఇప్పటికే టీ జేఏసీకి వెబ్ సైట్ రూపొందించారు. ఇప్పుడు కోదండరామే స్వయంగా ఫేస్ బుక్ లైవ్ తో యువత దగ్గరకు వచ్చారు.
టీ జేఏసీ తరఫున కొద్దిసేపటి క్రితం ఆయన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ నెల 22 న నిర్వహించే నిరద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఇది టీ జేఏసీ పిలుపుగా భావించకుండా యువత అంతా కలసిరావాలని కోరారు. ఎవరూ చొరవ తీసుకోకున్నా అందరూ బోనాలకు తరలివచ్చినట్లు నిరసన ర్యాలీకి కూడా అదే తరహాలు తరలిరావాలన్నారు. లక్ష ఉద్యోగాల మాటపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిలని కోరారు.
ఇప్పటికే నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రచారం చాపకింద నీరులా బాగానే సాగుతోంది. ప్రధానంగా సోషల్ మీడియానే వేదికగా ఈ ప్రచారం కొనసాగుతుండటం విశేషం.
యువత ఎక్కువగా సోషల్ మీడియాలో అందుబాటు ఉండటం ప్రస్తుతం టీ జేఏసీ ఎంచుకున్న సమస్య కూడా యువతదే కావడంతో వారు ఈ ప్రచారానికి తొందరగానే కనెక్టు అవుతున్నారు.
తమిళనాట జల్లికట్టు ఉద్యమం కూడా సోషల్ మీడియాలో వచ్చిన పిలుపును అనుసరించి యువతే విజయవంతం చూసింది.
అలాగే, ఈ నెల 22న ఇందిరా పార్కు నుంచి సుందరయ్య విజ్ఝాన కేంద్రం వరకు జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీ కూడా విజయవంతం అవుతుందా... జల్లికట్టు స్ఫూర్తి మన యువతలోనూ ఉందా అనేది తెలియాలంటే 22\2 వరకు ఆగాల్సిందే.