మోడీ కొలువులో కిషన్రెడ్డి: అమిత్ షా ఫోన్
సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కనుంది.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కనుంది.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేయనున్నారు. మోడీ కేబినెట్లో కిషన్ రెడ్డికి చోటు దక్కనుంది. గురువారం నాడు ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం నుండి కిషన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. మంత్రిగా ప్రమాణం చేసేందుకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చారు.
2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి బండారు దత్తాత్రేయ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల సమయంలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని కిషన్ రెడ్డి భావించారు. కానీ సాధ్యం కాలేదు. చివరి నిమిషంలో కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యాడు. వయో భారం కారణంగా ఈ దఫా దత్తాత్రేయకు బీజేపీ టిక్కెట్టును కేటాయించలేదు. దీంతో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి కిషన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రం నుండి నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంంది. దీంతో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.