Asianet News TeluguAsianet News Telugu

జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ నేతల భేటీ: మూడో జాబితా నేడు ఫైనల్ చేసే చాన్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై బీజేపీ  ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది.  ఇవాళ ఉదయం  జేపీ నడ్డా నివాసంలో  తెలంగాణ నేతలు  సమావేశమయ్యారు.

 Kishan Reddy and others  meet  BJP National President JP Nadda for finalise candidates list lns
Author
First Published Nov 1, 2023, 2:22 PM IST

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాపై బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో  తెలంగాణ నేతలు  బుధవారంనాడు  సమావేశమయ్యారు.

జేపీ నడ్డా నివాసంలో  జరిగిన సమావేశానికి  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  తెలంగాణ ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ  బీఎల్ సంతోష్, తెలంగాణ  రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  మాజీ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో  జనసేనతో పొత్తు,  అభ్యర్ధుల ఎంపిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. 

జనసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విదేశీ పర్యటనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత  జనసేనతో పొత్తు విషయమై బీజేపీనేతలు చర్చించనున్నారు.  కనీసం  తమకు  20 సీట్లు ఇవ్వాలని బీజేపీని జనసేన కోరుతుంది. అయితే  10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. జనసేనకు కేటాయించే స్థానాలను మినహాయించి  ఇతర స్థానాల్లో అభ్యర్థులను  బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.

 ఇవాళ రాత్రి  న్యూఢిల్లీలోని బీజేపీ  కార్యాలయంలో   ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది.ఈ సమావేశంలో రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఫైనల్ చేయనున్నారు.  తొలుత రాజస్థాన్  రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ  చర్చించనుంది.ఆ తర్వాత తెలంగాణలో అభ్యర్ధుల ఎంపికపై  చర్చించనుంది.  ఈ జాబితాకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపితే  రేపు ఉదయం  అభ్యర్ధుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 

also read:మూడో జాబితాపై బీజేపీ కసరత్తు: బీసీలు, మహిళలకు ప్రాధాన్యత

గత నెల  22న  52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను  ప్రకటించింది.  గత నె 27న  ఒకే ఒక్క అభ్యర్ధితో  రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.  రేపు ఉదయం బీజేపీ మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios