ఒంటరి మహిళలే టార్గెట్ గా.. ఏడుగురిని హత్యచేసిన ఘరానా హంతకుడు...
ఒంటరి మహిళలే లక్ష్యంగా ఓ ఘరానా హంతకుడు రెచ్చిపోతున్నాడు. వారిని హతమార్చి, నగదు, నగలతో జల్సాలు చేస్తున్నాడు. అతడిని పోలీసులు పట్టుకున్నారు.
నిజామాబాద్ : ఒక్కడే వెళ్లడం.. ఒంటరి మహిళలను గుర్తించడం… రాడ్డుతో హతమార్చి.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించడం.. ఇలా.. నాగారానికి చెందిన ఘరానా హంతకుడు జిల్లాలో ఏడుగురు మహిళలను హతమార్చాడు. తులాల కొద్దీ బంగారం దోచుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మాక్లూర్ లో జరిగిన హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇతనిపై గతంలోనూ వివిధ జిల్లాల్లో పదికి పైగా దొంగతనాల కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
ఇతర జిల్లాల్లోనూ…
నగర శివారులోని ఐదో ఠాణా పరిధిలోగల నాగారానికి చెందిన వ్యక్తి గత కొంతకాలంగా నేరాలకు అలవాటు పడ్డాడు. నగరంలో అడపాదడపా చోరీలు చేసిన ఇతడు సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేటలోనూ వాహనాలు, సెల్ఫోన్లు దొంగతనాలు చేశాడు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఇటీవల మాక్లూర్ మండలం డీకంపల్లి సమీపంలో ఓ మహిళను నిందితుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు అపహరించుకు వెళ్లారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు సహాయంతో నిందితుడి వివరాలు కాబట్టి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిసింది. చేసిన నేరాలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆరుకు పైగా హత్యలు చేసినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. ఇతని చోరీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
మల్కాజ్గిరిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి, క్షతగాత్రుల్లో సబ్రిజిస్ట్రార్