దొరికిన పాపకు ఆ లేడీ పోలీస్ అధికారి పేరు
కిడ్నాపర్ నైనా రాణి నుండి సురక్షితంగా వారం రోజుల చిన్నారిని రక్షించిన పోలీసులకు విజయ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. తమ కూతురును రక్షించేందుకు కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారి చేతన పేరును తమ కూతురుకు పెట్టుకోవాలని వారు నిర్ణయం తీసుకొన్నారు.విజయ దంపతులు తీసుకొన్న నిర్ణయం తమకు గర్వకారణమని హైద్రాబాద్ సీపీ అంజన్ కుమార్ చెబుతున్నారు.
హైదరాబాద్: ఒక్క రోజు వ్యవధిలోనే కిడ్నాపర్ చెంత నుండి చిన్నారిని రక్షించిన హైద్రాబాద్ పోలీసులను ఆ చిన్నారి తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని భావించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చేతన పేరును తమ పాపకు పెట్టుకోవాలని విజయ దంపతులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం హైద్రాబాద్ పోలీసులకే గర్వకారణమని హైద్రాబాద్ సీపీ అంజన్కుమార్ ప్రకటించారు.
సోమవారం నాడు కోఠి ప్రభుత్వాసుపత్రిలో విజయ అనే మహిళ నుండి నైనా రాణి అనే మహిళ ఆరు రోజుల చిన్నారిని కిడ్నాప్ చేసింది. పసికందును కిడ్నాప్ చేసి బీదర్ తీసుకెళ్లింది. చిన్నారిని కిడ్నాప్ చేసిన ఆ మహిళ ఎక్కడికి వెళ్లిందనే విషయమై సీసీటీవి పుటేజీ ఆధారంగా గుర్తించారు. ఎంజీబీఎస్ బస్స్టేషన్లో బీదర్ బస్సు ఎక్కిన విషయాన్ని గుర్తించారు.
ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసు అధికారి చేతన బీదర్ వెళ్లారు. కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులతో పాటు తెలంగాణకు చెందిన అధికారుల సహయంతో బీదర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు కారణంగా పోలీసుల ఒత్తిడి పెరిగిందని భావించిన నైనా రాణి బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారని మంగళవారం నాడు మధ్యాహ్నం వదలి వెళ్లిపోయింది.
ఈ విషయం తెలిసిన వెంటనే చేతనఆసుపత్రికి చేరుకొన్న చిన్నారిని పిల్లల వైద్యులతో చికిత్స నిర్వహించారు. ఆ చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు ప్రకటించారు. అంతేకాదు తన ఫోన్ ద్వారా చిన్నారి తల్లితో వీడియో కాల్ మాట్లాడించారు.
పాప ఆరోగ్యంగా ఉందని చెప్పి విజయ కంగారు పడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. బుధవారం తెల్లవారుజామున చిన్నారి తల్లి ఒడి చేరేలా చేతన జాగ్రత్త తీసుకొంది. తన కూతురు తన వద్దకు చేరుకోవడంతో విజయతో పాటు ఆమె కుటుంబసభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు.
అయితే తమ కూతురును తమ వద్దకు సురక్షితంగా చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారి చేతన పేరును తమ కూతురుకు పెట్టాలని విజయ దంపతులు నిర్ణయం తీసుకొన్నారు.
ఈ విషయాన్ని హైద్రాబాద్ సీపీఅంజన్ కుమార్ కు ఆ దంపతులు తెలిపారు. ఒక పోలీసు అధికారి పేరును పెట్టుకోవాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడం పట్ల సీపీ హర్షం వ్యక్తం చేశారు.