ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలను తన సమావేశానికి రాకుండా అడ్డుకుంటున్నారని, కానీ ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా ఈ రోజు తన అనుచరులు, మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏదైనా ఇబ్బంది పెడతారనే వాళ్లు నా సమావేశానికి రాలేదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇలాంటి వాటికి శీనన్న నొచ్చుకోడని మీరు రాకపోయినా పర్లేదని ఆయన తెలిపారు. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుందన్న ఆయన.. సందర్భం వచ్చినప్పుడు శీనన్న గూటికి కాలమే చేరుస్తుందని వ్యాఖ్యానించారు. 

కాగా.. బీఆర్ఎస్ నుంచి తన అనుచరులను సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించారని.. వాళ్ల గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారని.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన బొమ్మ ఎందుకు వేశారని ప్రశ్నించారు. తన అనుచరుల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నట్టుగా చెప్పారు. 

ALso REad: వుంటే వుండండి, పోతే పోండి.. వ్యక్తులపై బీఆర్ఎస్ ఆధారపడదు, సస్పెన్షన్ తప్పదు : పొంగులేటీకి పువ్వాడ కౌంటర్

ఇదిలావుండగా.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో మాజీ ఎంపీ పొంగులేటి వర్గంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాబు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. వీరిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ , వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్ సహా మరో 18 మంది వున్నారు. బీఆర్ఎస్ పెద్దలతో పొంగులేటికి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మండల స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఐదు మండలాలకు చెందిన నేతలతో శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేసింది.