భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తన భార్యతో కలిసి లొంగిపోయాడు. సుధాకర్పై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయాల రివార్డును కూడ ప్రకటించింది.
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తన భార్యతో కలిసి లొంగిపోయాడు. సుధాకర్పై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయాల రివార్డును కూడ ప్రకటించింది.
బుధవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు మీడియా సమావేశంలో మావోయిస్టు దంపతులను చూపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోల కొరియర్గా చేరారు.
పలు హింసాత్మక ఘటనల్లో సుధాకర్ కీలకంగా వ్యవహరించారు.2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్పై కోటి రూపాయల రివార్డును జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని సుధాకర్ పెళ్లి చేసుకొన్నాడు. పార్టీలో చోటు చేసుకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా సుధాకర్ లొంగిపోయాడు. సారంగపూర్ మండలానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కొడుకు ఒగ్గు సట్వాజీ పదో తరగతి వరకు స్థానికంగా చదివారు. 1981-83 లో ఇంటర్ చదివే సమయంలో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు.
ఇంటర్ చదివే రోజుల్లోనే ఆర్ఎస్యూ నేతలతో సంబంధాల కారణంగా సుధాకర్ అప్పటి పీపుల్స్ వార్ నేతలకు కొరియర్ గా మారాడు.1984లో పీపుల్స్వార్లో సుధాకర్ చేరాడు.1986లో సట్వాజీ కర్టాటకలోని గుల్బార్గాలో పోలీసులకు చిక్కాడు. 1989 చివరివరకు జైలులో ఉన్నాడు.
చెన్నారెడ్డి ప్రభుత్వం పీపుల్స్వార్ పై నిషేధం ఎత్తివేయడంతో సుధాకర్ ఇంటి వద్దనే ఉన్నాడు. ఆ తర్వాత పీపుల్స్వార్ పై ప్రభుత్వం నిషేధం విధించడంతో తిరిగి ఆయన పీపుల్స్ వార్ లో చేరారు.
తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా తన భార్య మాధవి అలియాస్ నీలిమతో పాటు సట్వాజీ అలియాస్ సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం
రాష్ట్ర కమిటీ కొరియర్గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.