Asianet News TeluguAsianet News Telugu

రౌడీ షీట్లు, 101 క్రిమినల్ కేసులు ... రాజాసింగ్ పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌లో కీలక విషయాలు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌లో పలు కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. 

key details in mla raja singh pd act document
Author
First Published Aug 25, 2022, 7:35 PM IST


గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ నమోదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ రాజాసింగ్‌కు అందజేశారు పోలీసులు. రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత ఘర్షణలకు దారి తీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్లు వున్నట్లు డాక్యుమెంట్‌లో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో .. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలోనే ఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు ఆయనకు సూచించారు. అయినప్పటికీ పొలీసుల సూచనలను రాజాసింగ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. 

అయితే రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తరుచూ నేరాలకు పాల్పడేవారికి, పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తారు. నేరస్థులు సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నారనే కారణంతో ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సంబంధించిన వివరాలను.. పీడీ యాక్ట్ బోర్డు ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పీడీ యాక్ట్ బోర్డు సమావేశం జరుగుతుంది. అయితే ఆ బోర్డు.. పీడీ యాక్ట్‌‌ను నిర్దారిస్తే ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. 

ALso Read:రాజా సింగ్‌కు బెయిల్ దొరకడం కష్టమేనా?.. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్..!

ఈ నెల 22న రాజాసింగ్ రెచ్చగొట్టేలా ఓ యూట్యూబ్ చానల్‌‌లో ఓ వీడియో పోస్టు చేశారని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు.  ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకన్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. ఇక, రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. రాజా సింగ్ అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios