తొందర్లో కెసిఆర్ 'పల్లె నిద్ర'
ప్రభుత్వం గత మూడేళ్లలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమిచేయనుందో వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగుతున్నారు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ పల్లె బాట పట్టనున్నారు.
తొందర్లో ఆయన అన్నిజిల్లాలు పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. బహుశా బడ్జెట్ సమావేశం అయిపోగానే ఆయన పల్లె దారి పడతారు. తెలంగాణా వచ్చాక, ఏవో కొన్ని ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు వెళ్లడం తప్ప ఆయన ప్రజలతో ముఖాముఖి జరపింది లేదు. నిన్నటి నుంచి ఆయన ప్రజలతో ముఖాముఖి జనహిత పేరుతో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
దానిని ఇక ముందు పల్లె ముంగిట్లో జరపాలనుకుంటున్నారు. ఇందులోభాగంగా ఆయన ప్రతిజిల్లాలో కొన్ని గ్రామాలలో రాత్రి నిద్ర చేస్తారు. రాత్రి అక్కడి ప్రజలతో కలసిమెలసి ఉంటారు. సమస్యలు తెలుసుకుంటారు. గ్రామ సభలో పాల్గొంటారు. రాత్రి భస చేసి పొద్దున మరొక గ్రామానికి బయలుదేరేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది.
ఇటీవల తెలంగాణా రాజకీయపార్టీలు తెగ యాత్రలు చేశాయి. కాంగ్రెస్ నాయకులు ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ పార్టీలో యాత్రలు చేయని నాయకులెవరూ లేరు.
జిల్లా జిల్లాలో వారు సమావేశాలు పెట్టారు. మరొక వైపు సిపిఎం కార్యదర్శి తమ్మినేటియాత్ర ఇంకా కొనుసాగుతూ ఉంది. తెలుగుదేశం రేవంత్ రెడ్డి యాత్ర చేశారు. ఇక తెలంగాణా జెఎసి నేత కోదండరామ్ ఎపుడూ యాత్రలలో జిల్లా పర్యటనలలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల మీద, ఉద్యోగాల మీద,భూసేకరణ మీద అపోహలు సృష్టిస్తున్నారని టిఆర్ ఎస్ భావిస్తూ ఉంది.
వీటన్నింటిని పొగొట్టేందుకు, ప్రభుత్వం గత మూడేళ్లలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమిచేయనుందో వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగుతున్నారు.
ఇందులో భాగమే ఈ జిల్లా యాత్రలు, పల్లెనిద్రలు అని అధికారులు చెబుతున్నారు.