CM KCR: సీఎం కేసీఆర్ నేషనల్ టూర్.. పలువురు జాతీయ నేతలతో భేటీ!
CM KCR: జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడానికి జాతీయ రాజకీయాల్లో రోడ్ మ్యాప్కు సిద్దం చేసుకున్నాడట.
CM KCR: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడం కోసం సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. పలువురు జాతీయ నేతలను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా కలువబోతున్నడు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పించిన ఆయన శుక్రవారం నుంచి వివిధ రాష్ట్రాల పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడానికి జాతీయ రాజకీయాల్లో రోడ్ మ్యాప్కు సిద్దం చేసుకున్నాడట. ఇందు కోసం అవసరమైన కసరత్తు చేసినట్టు తెలిసింది.
ఈ పర్యటనలో ఆయన రాజకీయ, ఆర్థిక, మీడియా రంగానికి చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారట. అలాగే.. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను కూడ పరామర్శించనున్నట్టు టాక్. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను కలిసి వారిని పరామర్శించనున్నారట.
ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సినీనటుడు ప్రకాశ్రాజ్, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఆయన నేషనల్ టూర్ మే 20వ తేదీ నుంచి అనుసరించాల్సిన షెడ్యూల్ను సిద్ధం చేసినట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు :
మే 20 శుక్రవారం .. సీఎం కేసీఆర్ ఢిల్లీ లో పర్యటించనున్నారు. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సీఎం సమావేశం కానున్నారు. అలాగే.. పలువురు ఆర్థికవేత్తలతో దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు.
మే 22 వ ఆదివారం మధ్యాహ్నం.. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి చంఢీఘర్ కు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసాగా.. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని... ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి చేపడతారు.
26 మే ఉదయం... బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కీలక భేటీ కానున్నారు. ఇదే సమయంలో సీని నటుడు ప్రకాశ్ రాజ్ తో సమావేశం కానున్నారు.
మే 27 తేదీన బెంగుళూరు నుంచి మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీకానున్నారు. అటునుంచి షిర్డీకి వెళ్లి.. సాయిబాబా దర్శనం చేసుకుని అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్ కు సిఎం కెసిఆర్ చేరుకుంటారు.
అటు తర్వాత మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సిఎం కెసిఆర్ సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకోనున్నారు.