స్వరూపానందతో కేసీఆర్ భేటీ: ఏపీ రాజకీయాలపై చర్చ
కేసీఆర్ స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత 20 నిమిషాలు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావం రోజునే స్వరూపానందను కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు స్వరూపానందతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో స్వరూపానంద స్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.
కేసీఆర్ స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత 20 నిమిషాలు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావం రోజునే స్వరూపానందను కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరువురి భేటీలో ఆధ్యాత్మిక, రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం ఫలితాలు వెలువడడానికి ముందే, అంటే మే 23వ తేదీలోగానేఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. సెంటిమెంట్ లో భాగంగానే కేసీఆర్ స్వరూపానందను కలిసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో స్వరూపానందను కలిసిన తర్వాతనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చలు మొదలు పెట్టారు.
ఇద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా స్వరూపానందను కేసీఆర్ అడిగినట్లు సమాచారం.