పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రొఫెసర్ జి హరగోపాల్‌పై నమోదైన కేసు విషయంలో సీఎం కేసీఆర్ కీలక  నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రొఫెసర్ జి హరగోపాల్‌పై నమోదైన కేసు విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హరగోపాల్‌తో పాటు, ఇతరులపై నమోదైన ఉపా కేసును ఎత్తివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ మేరకు కేసులు ఎత్తివేయాలని తెలంగాణ డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, మావోయిస్టులతో చేతులు కలిపి తుపాకీతో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు పలువురిపై UAPA కేసు నమోదైంది.

ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరో 151 మందిని నిందితులుగా చేర్చారు. ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.ప్రజా ప్రతినిధులు చంపేందుకు కుట్ర చేశారని పోలీసులు ఆరోపించారు. మావోయిస్టుల పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

Also Read: ప్రొ.హరగోపాల్‌పై దేశద్రోహం కేసు .. బెయిల్ పిటిషన్‌తో వెలుగులోకి, మరో 152 మందిపైనా అభియోగాలు

ఇందులో హరగోపాల్‌ను నంబరు 42గా పేర్కొన్నారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. హరగోపాల్‌ను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇక, హరగోపాల్‌పై యూఏపీఏ కేసు విషయం ఇటీవల వెలుగులోకి రాగా.. పలువురు పోలీసులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.