KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?
తెలంగాణలో పవర్ ఫుల్ పోలిటికల్ ఫ్యామిలీ కల్వకుంట్ల వారసుడు హిమాన్షు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఏం చదువుకుంటున్నాడు? అని తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? అయితే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

కేటీఆర్ కొడుకు హిమాన్షు మామూలోడు కాదు గురూ..!
Kalvakuntla Himanshu : భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇటీవల రాష్ట్రంలో సందడి చేసిన విషయం తెలిసిందే. తన విదేశీ స్నేహితులతో కలిసి హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాడు... తన తాత హయాంలో కట్టిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాల వద్ద ఫోటోలకు ఫోజులిచ్చాడు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తండ్రి సొంత నియోజకవర్గం సిరిసిల్లలో సామాన్యుడిలా పర్యటించాడు. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి తాత కేసీఆర్ ను కలిశాడు... స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే విదేశీ స్నేహితులతో హిమాన్షు ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరికి ఓ డౌట్ రావడం పక్కా. హిమాన్షు అమెరికాలో ఎక్కడ ఉంటున్నాడు? ఏ యూనివర్సిటీలో, ఏం చదువుకుంటున్నాడు? అనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కల్వకుంట్ల హిమాన్షు ఏం చదువుకుంటున్నాడు?
ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాలో ఉంటున్నాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్ బర్గ్ లోని ప్రపంచ ప్రసిద్ద పరిశోధనా విశ్వవిద్యాలయం 'కార్నెగీ మెల్లోన్ యూనివర్సిటీ' లో చదువుకుంటున్నాడు. ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ తో పాటు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో టాప్ క్లాస్ విద్యాబోధన అందిస్తోంది. అందుకే తన కొడుకును చదివించేందుకు కేటీఆర్ ఈ యూనివర్సిటీని ఎంచుకున్నారు.
ఈ కార్నెగీ మెల్లోన్ యూనివర్సిటీలో హిమాన్షు బిజినెస్ ఆండ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోర్సు చదువుతున్నాడు. భవిష్యత్ అంతా ఏఐదే అని గుర్తించే హిమాన్షు ఈ కోర్సులో చేరినట్లు తెలుస్తోంది. ఈ యూనివర్సిటీలో ఏఐ కోర్పుతో పాటు తనకు ఎంతో ఆసక్తి కలిగిన ఇన్నోవేషన్, ఎంట్రపెన్యూర్, ఎకనమిక్స్ వంటి విషయాల గురించి కూడా నేర్చుకుంటున్నట్లు కల్వకుంట్ల హిమాన్షు లింక్డిన్ లో వెల్లడించారు.
టీచర్ అవతారమెత్తిన హిమాన్షు
కార్నేగీ మెల్లన్ యూనివర్సిటీలో ఓవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే మరోవైపు టీచర్ అవతారం ఎత్తాడు హిమాన్షు. 'ఇంట్రడక్షన్ టు ఆంట్రప్రెన్యూర్షిప్' కోర్సుకు టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు లింక్డిన్ ప్లాట్ ఫామ్ ద్వారా స్వయంగా వెల్లడించాడు హిమాన్షు. దాదాపు 40 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెంటార్ గా వ్యవహరిస్తున్నానని హిమాన్షు తెలిపాడు.
ఇక స్టార్టప్ బృందాలు తమ వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకునేటప్పుడు, వాటిని మెరుగుపరుచుకునే క్రమంలో ప్రత్యక్ష మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నానని హిమాన్షు తెలిపాడు. వారి వ్యాపార ప్రణాళికలు స్పష్టంగా, ఆచరణాత్మకంగా ఉండేలా చూస్తానని.. వ్యాపార పద్ధతులకు అనుగుణంగా ఉండేలా చూస్తూ వాటిపై తన ఫీడ్బ్యాక్ను అందిస్తానని వెల్లడించాడు. ఈ బాధ్యత తన నాయకత్వ లక్షణాలను, ఏకాగ్రతను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతోందని కల్వకుంట్ల హిమాన్షు తెలిపాడు.
సామాజిక సేవలో హిమాన్షు
హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్లో చదువుకున్న హిమాన్షు చదువులో మంచి ప్రతిభ కనబర్చేవాడు. అంతేకాదు తన తండ్రి కేటీఆర్, తాత కేసీఆర్ బాటలో నడుస్తూ చిన్న వయసులోనే సామాజిక అంశాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే కోటి రూపాయల నిధులు సేకరించి హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయిలో డెవలప్ చేశాడు. ఇది హిమాన్షులోని సామాజిక స్పృహను, సేవాగుణాన్ని తెలియజేస్తుంది.

