పాలమూరులో ప్రాజెక్టులకు బాబు అడ్డు: కేసీఆర్
పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు అడ్డుకొంటున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు
కొడంగల్:పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు అడ్డుకొంటున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబునాయుడును కాంగ్రెస్ పార్టీ తమ భుజాల మీద ఎత్తుకొస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ఓడించాలని ఆయన కోరారు.
కోస్గిలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తోందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయన్నారు.
పాలమూరు ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. ప్రజల ఎజెండా గెలవాల్సిన అవసరం ఉందన్నారు.కోస్గి సభకు వచ్చిన జనాన్ని చూస్తే పట్నం నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్, టీడీపీల పాలనలో విద్యుత్ను ఎందుకు సక్రమంగా సరఫరా చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులకు శ్రద్ధ లేదన్నారు.
గత పాలకులకు తమ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూడాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలను గమనించాలని ఆయన ప్రజలను కోరారు.
రెండో దఫా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొంటే సంక్షేమ పథకాలను మరింత ఎక్కువ ఖర్చుతో అమలు చేస్తామన్నారు.
పాలమూరు జిల్లాకు పాలమూరు జిల్లాలోనే శత్రువులు ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు.
పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబునాయుడు అడ్డుకొంటున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడును కాంగ్రెస్ పార్టీ తమ భుజాల మీద ఎత్తుకొస్తున్నారని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్పై నాగం జనార్ధన్ రెడ్డితో పాటు దేవరకద్ర, కొల్లాపూర్ ల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కేసులు వేశారని చెప్పారు.
ఈ కేసులు తప్పుడు కేసులు వేశారని హైకోర్టు నిన్ననే కొట్టి వేసిందన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం అనేక అవమానాలను అనుభవించానని ఆయన గుర్తు చేశారు.పాలమూరు ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పూర్తి చేసినట్టు తెలిపారు.