సంక్రాంతి తర్వాత వాటిపై కేసీఆర్ ఫోకస్.. టీఆర్ఎస్ శ్రేణుల్లో భారీ ఆశలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్రావు (K Chandrashekar Rao) .. విపక్ష బీజేపీపై పోరాటాన్ని ముమ్మరం చేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీ వైపు చూడకుండా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్రావు (K Chandrashekar Rao) .. విపక్ష బీజేపీపై పోరాటాన్ని ముమ్మరం చేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీ వైపు చూడకుండా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ వైపు చూడకుండా ఉండేలా ఇప్పటినుంచే జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఖాళీగా nominated posts ఎక్కువగా టీఆర్ఎస్ నేతలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. అంతేకాకుండా పార్టీ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీని ప్రారంభించారు. మన్నె క్రిషాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వీడా సాయిచంద్లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించారు. అయితే ప్రస్తుతం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత వాటిని భర్తీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇలా చేయడం పార్టీ నేతల్లో అసంతృప్తిని తగ్గించొచ్చని ఆయన భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
చాలా కాలంగా టీఆర్ఎస్ కోసం కష్టపడుతున్నవారికి, ఇతర పార్టీల నుంచి చెందిన కొందరు కీలక నేతలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం.
మంత్రివర్గ విస్తరణ..?
అయితే తెలంగాణలో మంత్రి విస్తరణ కూడా జరిగే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ఒక్కరిద్దరికి మంత్రి వర్గం అవకాశం కల్పించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ బడ్జెట్ సమావేఆల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అవకాశాలను తోసిపుచ్చలేమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గతేడాది మే నెలలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఉద్వాసనతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలను మంత్రి హరీష్ చేపట్టారు. అయితే ఆ బాధ్యతలను హరీష్ వద్దే ఉంచుతురా..?, లేక ఆ స్థానంలో కొత్తవారికి ఎవరికైనా కేటాయిస్తారా..?, పూర్తిగా కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపడతారా..? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో సీఎంతో సహా 17 మంది సభ్యులు ఉన్నారు. కేబినెట్లో అగ్రవర్ణ ఆదిపత్యం ఉంది. ఇందులో ఆరుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు, నలుగురు (సీఎంతో సహా) వెలమ సామాజికవర్గానికి చెందినవారు, ఒకరు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు, వెనుకబడిన తరగతుల నుంచి ముగ్గురు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ ప్రక్రియలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కుల సమీకరణాలను సమతుల్యం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నామినేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు టీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎలాగైనా అధినేత దృష్టిలో పడి.. పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.