Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ ను ఏకిపారేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ తనదైన విశ్లేషణను అందించారు.

KCR lashes out at irmala Seetharaman union budget 2020
Author
Hyderabad, First Published Feb 1, 2020, 8:18 PM IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు.  కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

రావాల్సిన నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. 

కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ పై ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.      

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది.     

కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది.

2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం ఖచ్చితంగా వివక్షే. ఈ తగ్గుదల ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది.     

2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నది. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.

జిఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తున్నది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా  రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.  

కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్ వచ్చే సరికి గత ఏడాదికన్నా 148 కోట్ల రూపాయలు తగ్గించి, కేవలం 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. 

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు.

  తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు. 

అన్ని ప్రధాన రంగాలకు కోతలు  : కేసీఆర్  

రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. 

‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

బడ్జెట్ పై కేసీఆర్  ఇంకా ఇలా అన్నారు....

వ్యవసాయరంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. 

వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారు.

గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. 

విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. 

సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios