ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తక్షణమే 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సిఎం నిర్ణయించారు. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాల పై చర్చించారు.
ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసీ పై సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సీఎం ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తుందన్నారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు.. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎల్ ఐ సి సహా ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తుందన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం వెకకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుందని ఆయన చెప్పారు.
also read:ఈ నెల 23 నుండి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్: కేసీఆర్
అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకొని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను. నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.
ఆర్టీసీని లాభాల బాటలో నడిపిందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సిఎం తెలిపారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని,అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులను సీఎం అభినందించారు.
హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్ కు జిల్లాలనుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని అందుకోసం హైద్రాబాలో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సిఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ,ఆర్టీసి ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
