తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా: హుజూరాబాద్ ఉప ఎన్నిక సైతం....?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడే వద్దంంటూ కేసీఆర్ ప్రభుత్వం సీఈసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రావరం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ)కి లేఖ రాసింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందే ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా పడ్డాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగుసింది. ఈ ఆరుగురు కూడా ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో సీఈసి ప్రకటించింది. ఇప్పుడు ఆ ఎన్నికలపై సీఈసీ దృష్టి పెట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలని అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశిది. దానికి సమాధానంగా ప్రభుత్ప ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎన్నికలు ఇప్పుడు వద్దని కోరుతూ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు గత నెల 12వ తేదీన రాజీనామా చేశారు. దీంతో ఆరు నెలల లోపు, అంటే డిసెంబర్ 12వ తేదీలోగా హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలి. ఇందుకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నారు.
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడితే హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే, హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బిజెపిలు ఎన్నికల ప్రచారానికి దిగాయి. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజా దీవెన పేర పాదయాత్ర చేపట్టి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.