తెలుగు సినీ రంగానికి తీరని లోటు.. కైకాల సత్యనారాయణ మృతికి కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం..
కైకాల సత్యనారాయణ మృతికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, వైఎస్ జగన్ లు సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటుడి మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు.
హైదరాబాద్ : నవసర నటనా సార్వభౌముడు, మాజీ లోక్ సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కైకాల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కైకాల సత్యనారాయణ నట ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.
మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన విలక్షణ నటుడని, విభిన్నమైన పాత్రలు పోషించారని.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్థానం సంపాదించారని గుర్తుచేసుకున్నారు. 70యేళ్ల తెలుగు సినీ చరిత్రలో తొలితరం నటుడని అన్నారు. కైకాల మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. కైకాల సత్యనారాయణ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
మూడు తరాలకు గుర్తుండే నటుడు: కైకాల సత్యనారాయణకు మంత్రి తలసాని నివాళులు
ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కైకాల సత్యనారాయణ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పురాణేతిహాసాల సినిమాలనుంచి క్రైమ్ థిల్లర్స్ వరకు అన్నిరకాల సినిమాల్లో నటించారని.. స్పష్టమైన వ్యక్తీకరణ ఆయన సొంతం అన్నారు. అనేక రకాల విభిన్న పాత్రలను అలవోకగా పోషించారని.. మహోన్నత వ్యక్తి అని కైకాలను జగన్ కొనియాడారు.
60యేళ్ల నట జీవితంతో సుదీర్ఘకాలం సేవలందించిన నటుడు కైకాల సత్యనారాయణ అని ప్రశంసించారు. తెలుగు సినిమాకు, ప్రజలకు, అభిమానులకు ఆయన మరణం తీరనిలోటు అన్నారు. ఈ సందర్బంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.