హుజురాబాద్ ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ సమీక్ష.. హాజరైన ముఖ్య నేతలు..
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ ఓటమిపై సమీక్ష జరిపారు.
న్యూఢిల్లీ: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ హైకమాండ్ (congress high command) శనివారం సమీక్ష చేపట్టింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) భేటీ అయ్యారు. ఈ సమావేశానికి . టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, వి హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. హుజురాబాద్లో ఓటమికి సంబంధించి పార్టీ నేతల నుంచి కేసీ వేణుగోపాల్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 2018 ఎన్నికలతో ఓటు బ్యాంకు దారుణంగా పడిపోవడానికి గల కారణాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి హుజురాబాద్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన బల్మూరి వెంకట్ కూడా నివేదికను సమర్పించనున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. ఓటు బ్యాంకు తగ్గిపోవడంపై నేతల నుంచి సమాచారం సేకరించనుంది. అంతేకాకుండా పార్టీ ఓటమి గల కారణాలపై విశ్లేషణ జరపనుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలకు హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. హుజురాబాద్తో పాటుగా నాగార్జున సాగర్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపైనా చర్చించాలని కేసీ వేణుగోపాల్కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంక్, ఇందిరమ్మ ఓటు బ్యాంక్ ఏటు పోయిందని వీహెచ్ లాంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో సహా పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలని ఆయన కోరుతున్నారు.
ఇక, హుజురాబాద్లో కాంగ్రెస్ ఓటమికి సంబంధించి ఆ పార్టీ సీనియర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా భావిస్తున్న నేతలు దీనిని బాగా హైలెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్ కూడా హాట్ టాఫిక్గా మారాయి. ఈ క్రమంలోనే Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశం సుధీర్ఘంగా జరిగింది.ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనే పార్టీ నేతలు సీరియస్ గా చర్చించారు.పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియాగాంధీతో చర్చించాలని ఆయన సూచించారు. పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని ఠాగూర్ సూచించారు. ఇక, ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మొదటి నుంచి వెనకబడిన సంగతి తెలిసిందే. అభ్యర్థి ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణిని అవలంభించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు మినహా.. ఇతర ముఖ్య నేతలు అటువైపు చూడలేదు. ఈ పరిణమామాల నేపథ్యంలో ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్కు కేవలం 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఓటమికి పూర్తి బాధ్యత తానేనని Revanth Reddy ప్రకటించారు.