మేం లుచ్చాలమా, రూ.50 కోట్లిచ్చి పదవి తెచ్చుకున్నారు: రేవంత్ రెడ్డిపై కౌశిక్
కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన కౌశిక్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్ ఠాగూర్కి రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కౌశిక్ రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడిలాగా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పీసీసీ పదవిని ఎందుకు ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోసినోళ్లమంతా పిచ్చోళ్లమా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read:కౌశిక్ రెడ్డిపై బహిష్కరణ వేటు: ఇంటి దొంగలను వదిలేది లేదన్న రేవంత్ రెడ్డి
ఇదే సమయంలో పొన్నం, రేవంత్ రెడ్డిలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. పొన్నంకి డిపాజిట్ వస్తుందేమో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వల్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. పొన్నం, రేవంత్ రెడ్డిలు ఈటలకు కోవర్ట్లని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునన్నారు. లుంగి కట్టుకుని ఢిల్లీ నుంచి వచ్చే మాణిక్ ఠాగూర్కి కొంచెం కూడా కామన్ సెన్స్ వుండదని, పెద్ద లీడర్ని అని చెప్పుకుంటారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాణిక్ ఠాగూర్ పెద్ద యూజ్ లెస్ ఫాలో అని ధ్వజమెత్తారు. మాణిక్ ఠాగూర్కి రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.