అమిత్ షా ఫోన్: కర్ణాటకలో చక్రం తిప్పింది తెలుగువాడే...
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి తరఫున చక్రం తిప్పిన నేత తెలుగువాడే.
హైదరాబాద్: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి తరఫున చక్రం తిప్పిన నేత తెలుగువాడే. అదీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన పేరు మురళీధర్ రావు.
కర్ణాటక ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆయన తీవ్రంగా శ్రమిస్తూ వచ్చారు. కర్ణాటకలో పార్టీ విజయం సాధించిన వెంటనే బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా నుంచి ఆయన ఫోన్ కాల్ స్వీకరించారు.
మురళీధర్ కరీంనగర్ జిల్లాలోని కోరపల్లి గ్రామానికి చెందినవారు. వరంగల్ లో డిగ్రీ చేశారు. అప్పటి నుంచి ఆయన ఎబివిపిలో పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.
ఎంఎ ఫిలాసఫీ చేశారు. ఆ కాలంలోనే ఆయనపై విశ్వవిద్యాలయంలో నక్సల్స్ అనుబంధ సంస్థ కాల్పులు జరిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శిగా 1984లో పనిచేశారు. చిన్న వయస్సులోనే ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరారు. స్వదీశీ జాగరణ్ మంచ్ వ్యవహారాలు చూపించాడు.
స్వదేశీ జాగరణ్ మంచ్ ఉద్యమంలో ఆయన దత్తోపంత్, మదన్ దాస్, ఎస్ గురుమూర్తి వంటి నేతలతో కలిసి పనిచేశారు.ఆయన 2009లో బిజెపిలో చేరారు. రాజ్ నాథ్ సింగ్ వద్ద పనిచేశారు. 2010లో బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మురళీధర్ రావు ట్విట్టర్ లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఆయన విశేషమైన కృషి చేశారు.