రాజ్ భవన్ కు మారిన కన్నడ పొలిటికల్ సీన్
పెరుగుతున్న టెన్షన్..
కన్నడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో క్షణ క్షణం ఉత్కంట రేపుతున్నది. రాజకీయ సీన్ రాజ్ భవన్ చేరింది. రాజ్ భవన్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందా అని ఉత్కంఠగా రెండు శిబిరాలు ఎదురుచూస్తున్నాయి.
కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ను బిజెపి నేతలు యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అనుమతించాలని కోరారు. తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు.
అయితే మరోవైపు కాంగ్రెస్, జెడిఎస్ కూటమి కూడా గవర్నర్ ను కలిసింది. తమ కూటమికి అత్యధిక స్థానాలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరారు.
అయితే ఇరు వర్గాల వాదనలు, వినతిపత్రాలను గవర్నర్ తీసుకున్నారు. ఇక రాజ్ భవన్ దీనిపై నిర్ణయాన్ని వెలువరించడం తరువాయి. అయితే అన్ని కోణాల్లో రాజ్ భవన్ కసరత్తు చేసిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం గవర్నర్ కు నివేదించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించిన తర్వాతే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
మొత్తానికి ఇప్పుడు సీన్ అంతా రాజ్ భవన్ కు చేరడంతో ఇటు రాజకీయ పార్టీల్లో అటు జనాల్లో టెన్షన్ మరింత తీవ్రమవుతున్నది.