కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు కర్ణాటక షాక్
కిం కర్తవ్యం ?
తెలంగాణ సిఎం కేసిఆర్ నెలకొల్పబోతున్న జాతీయస్థాయి ఫెడరల్ ఫ్రంట్ కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఎన్నికలు దగ్గరలో ఉన్న సమయంలో తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లి జెడిఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడతో, మాజీ సిఎం కుమారస్వామితో కలిసి చర్చలు జరిపారు. కర్ణాటక ఎన్నికల్లో జెడిఎస్ పట్ల సానుకూలతను ప్రకటించింది టిఆర్ఎస్. కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కర్ణాటకలో ఆ రెండు పార్టీల తర్వాత బలంగా ఉన్న జెడిఎస్ తో టిఆర్ఎస్ ఫ్రండిషిప్ చేయాలని బావించింది. అయితే ప్రత్యక్షంగా జెడిఎస్ పార్టీకి మద్దతుగా ప్రచార పర్యంలో టిఆర్ఎస్ దిగలేదు. కానీ భవిష్యత్తులో జెడిఎస్ తో కలిసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆశతో టిఆర్ఎస్ ఎదురుచూసింది.
కానీ ఫలితాలు మాత్రం జెడిఎస్ తో పాటు టిఆర్ఎస్ కు సైతం షాక్ ఇచ్చాయి. బిజెపి స్పష్టమైన ఆధిక్యత సాధించే పరిస్థితులు కనబడుతున్నాయి. కన్నడ ఎన్నికల్లో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్రమైన విమర్శలే చేసింది. జెడిఎస్ అనే స్థానిక పార్టీ బిజెపితో కలిసి పనిచేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. అలాంటి జెడిఎస్ కు టిఆర్ఎస్ మద్దతుగా ఉండడంత చూస్తే టిఆర్ఎస్ పార్టీ బిజెపి ఆడించినట్లే ఆడుతుందన్న విమర్శలు చేసింది. బిజెపి కనుసన్నల్లోనే ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణమవుతోందన్న విమర్శలు గుప్పించింది. కన్నడ ఫలితాల నేపథ్యంలో మరి ఇప్పుడు టిఆర్ఎస్ ఏరకమైన స్టాండ్ తీసుకుంటుందన్నది చూడాలి. ఎందుకంటే జెడిఎస్ ఆశలు ఆవిరైపోయాయి. హంగ్ వస్తుంది.. అప్పుడు తాము కింగ్ అవుతామని జెడిఎస్ ఆరాటపడింది. కానీ అలాంటి ఫలితాలేమీ వచ్చేలా లేవు. మరి ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో జెడిఎస్, టిఆర్ఎస్ ఫ్రెండ్ షిప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.