Huzuraba Bypoll: హుజురాబాద్లో రూ. 3 లక్షల నగదు పట్టివేత.. విస్తృత తనిఖీలు
ఉప ఎన్నిక సందర్భంగా హుజురాబాద్లో కరీంనగర్ పోలీసులు కచ్చితంగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షలకుపైగా నగదును సీజ్ చేశారు. తాజాగా రూ. 3 లక్షల నగదును పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
కరీంనగర్: ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్లో గేమ్ స్టార్ట్ అయింది. ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవ్వగానే ప్రలోభాలు ఊపందుకుంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, పోలీసులూ అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో కోడ్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ బి సత్యనారాయణ ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి.
తాజాగా, హుజురాబాద్లో రూ. 3 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే, రూ. 15వేలు విలువ చేసే మద్యాన్నీ స్వాధీనం చేసుకున్నారు. కోడ్ అమలవుతున్న సందర్భంగా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పోలీసు కమిషనర్ బి సత్యనారాయణ సమీక్షిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.
హుజురాబాద్లో ఇప్పటి వరకు 30 లక్షలకుపైగానే నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4 లక్షల విలువ చేసే లిక్కర్, చీరలు సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై దాదాపు రెండు డజన్ల కేసులు నమోదయ్యాయి.
మంగళవారం సిగాపూర్ దగ్గర మంత్రి హరీశ్ రావు, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకకర్ల వాహనాలను పోలీసులు చెక్ చేశారు.