దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డి ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు . ఈ సందర్భంగా జెట్ సెట్ గోకు సంబంధించిన కీలక వివరాలను ఆమె అధికారులకు అందజేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శనివారం ఈడీ విచారణకు హాజరయ్యారు కనికారెడ్డి. జెట్‌సెట్ గోకు సంబంధించిన వివరాలను ఆమె ఈడీకి అందించినట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ విమానాల్లో డబ్బులు తరలించారన్న ఆరోపణలపై ఈడీ ఆమెను విచారిస్తోన్నట్లుగా సమాచారం. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈడీ కీలక వివరాలు సేకరించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఇకపోతే...ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత లోతుగా విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డితోపాటు వినయ్ బాబులను ఈడీ అధికారులు ఈ నెల 10వ తేదీన అరెస్ట్ చేశారు. అంతకుముందు మూడు రోజులుగా వీరిద్దరిని విచారించారు. శరత్ చంద్రారెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మూడు రోజులపాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణ సమయంలో శరత్ చంద్రారెడ్డి విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. 

ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కాం: బేగంపేట ఎయిర్‌పోర్ట్ ద్వారా నగదు బదిలీ.. తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతోన్న కనికా టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థ సీఈవోగా శరత్ చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. దీంతో దీనిపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఈడీ వివరాలు కోరింది. గత నెల 17వ తేదీనే ఎయిర్‌పోర్టు అథారిటీకి లేఖ రాసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.