తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇంతవరకు ఏ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదని విమర్శించారు.

హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై వై ఐ యామ్ నాట్ ఎ హిందు గ్రంథ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించాలి అనే అశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇంతవరకు ఏ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు.

విగ్రహం కూల్చివేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్‌ స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అంబేద్కర్‌తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదని అన్నారు. 

అన్ని రకాల పీడనలకు, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని, అప్పుడే తెలంగాణలో కుల వివక్ష పోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కావాలనే దళితులను, కమ్యూనిస్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.