కాంగ్రెస్ శ్వేతపత్రాలకు కౌంటర్: స్వేద పత్రం విడుదల చేసిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేత పత్రాలకు పోటీగా భారత రాష్ట్ర సమితి సేద పత్రాన్ని విడుదల చేసింది.
![Kalvakuntla Taraka Rama Rao Releases Sweda Patram in Hyderabad lns Kalvakuntla Taraka Rama Rao Releases Sweda Patram in Hyderabad lns](https://static-ai.asianetnews.com/images/01hexssae2se7fwrtejr8p0tx7/ktr-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్ల భారత రాష్ట్ర సమితి పాలనపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పై శ్వేత పత్రాలు విడుదల చేసింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా తమ ప్రభుత్వ పాలనపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బాధ్యత గల పార్టీగా స్వేద పత్రం విడుదల చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడక, అబద్దాల పుట్టగా ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రూ. 3.17 లక్షల కోట్లు అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6.70 లక్షల కోట్లుగా చూపిందని ఆయన ఆరోపించారు.ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు ఇవ్వని రుణాలకు కూడ అప్పులుగా చూపుతున్నారని కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న అప్పు రూ.3,17,051 కోట్లు మాత్రమేనని కేటీఆర్ వివరించారు. లేని అప్పును ఉన్న అప్పుగా చూపి తిమ్మిని బమ్మి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆర్టీసీ, విద్యుత్ , పౌరసరఫర శాఖల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు.పౌరసరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ. 21,029 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.నిల్వలు, కేంద్రం నుండి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారని కేటీఆర్ విమర్శించారు.
జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారన్నారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ. 13, 72.930 కోట్లుగా కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో అగ్రస్థానంలో ఉందని ఆయన తేల్చి చెప్పారు.తెలంగాణకు ఆస్థిత్వమే కాదు, ఆస్తులు కూడ సృష్టించామని కేటీఆర్ వివరించారు. 60 ఏళ్లలో రూ. 4.98.053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ద అబద్దమన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేసినట్టుగా కేటీఆర్ చెప్పారు. సంక్షోభం నుండి సమృద్ధి వైపు తీసుకెళ్లినట్టుగా కేటీఆర్ వివరించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రానికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని కేటీఆర్ విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు విరిగిన లాఠీలకు , పేలిన బుల్లెట్లకు లెక్కలేదన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తొలి నాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.తెలంగాణ ప్రయోగం విఫలం అవుతుందని కొందరు విమర్శించారని కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పడిన తొలినాళ్లలోనే కొందరు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్నారు.
Watch live: BRS Party Working President @KTRBRS giving a PowerPoint presentation (Swedha Pathram). https://t.co/ihhEoqvcbX
— BRS Party (@BRSparty) December 24, 2023
రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష నెలకొందని కేటీఆర్ చెప్పారు.ఎన్నో పోరాటాలతోనే తెలంగాణ సాకారమైందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు తమ వల్లనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారన్నారు.