పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు వస్తుంది: కవిత చమత్కారం
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడంలో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి, వారికి ప్రోత్సాహం అందిస్తున్నదని కవిత తెలిపారు.మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వి హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
హైదరాబాద్: మహిళలు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా ఉత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించింది.
ఆ సమావేశానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.హైదరాబాద్ లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మహిళ తానూ, తన కుటుంబం ఉన్నత స్దాయికి ఎదగాలని కలలు కంటారు..అయితే ఈ కల సాకారం కావడంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు. వీటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సింది మనమేనన్నారు.
మహిళలు సంఘటితంగా ఉంటే, భవిష్యత్ లో పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని కవిత చమత్కరించారు. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.మహిళాపారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నదనీ కవిత చెప్పారు.మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడంలో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి, వారికి ప్రోత్సాహం అందిస్తున్నదని కవిత తెలిపారు.
మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వి హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. వి హబ్ ను నాలెడ్జి పార్టనర్ గా కేంద్రం తీసుకుంటే తెలంగాణ బిడ్డలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో మహిళలు పారిశ్రామిక రంగంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల కోసం ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందించాలనీ కోరారు. అయితే ఆదాయపు పన్ను మినహాయింపును మహిళా పారిశ్రామికవేత్తల కోరుతున్నారని, దీన్ని పరిశీలించాలని అన్నారు. అలాగే ఐటీ సెజ్ లలో మహిళల ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు.తెలంగాణ లో 42 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆమె అన్నారు.
బ్యాంకులు లోన్లు సకాలంలో ఇవ్వకుండా మహిళలను ఇబ్బంది పెడుతున్నాయని, ఈ విషయమై బ్యాంకర్లు తమ ఆలోచన ధోరణిని మార్చుకుని మహిళలకు విరివిగా రుణాలను ఇవ్వాలని ఆమె అన్నారు.
సమావేశంలో ఎం.ఎస్.ఎం. ఈ మంత్రిత్వ శాఖ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ మన్ దీప్ కౌర్, భారత చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఫోరం చైర్మన్ ప్రహ్లాద్ కాకర్, అధ్యక్షులు వినోద్ కుమార్, యుఎన్ డీపి నైపుణ్య, వ్యాపార అభివృద్ధి చీఫ్ క్లెమెంట్ చావ్ట్, ఎం.ఎస్.ఎం.ఈ హైదరాబాద్ అదనపు పారిశ్రామిక సలహాదారు చంద్రశేఖర్ డాకూరి, ni-msme డైరెక్టర్ సంజీవ్ చతుర్వేది పాల్గొన్నారు.
"