Asianet News TeluguAsianet News Telugu

బిజెపిలో చేరుతున్నట్లు వార్త: భగ్గుమన్న కడియం, బహిరంగ లేఖ

తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల విషయం తనకు కాస్తా ఆలస్యంగా చేరిందని, ఇంతటి సత్యదూరమైన వార్తను ఏ విధమైన ఆధారం లేకుండా బాధ్యతారహితంగా ప్రచురించారని కడియం అన్నారు.

Kadiam srihari writes open letter to media
Author
Hyderabad, First Published Jul 1, 2019, 1:09 PM IST

హైదరాబాద్: తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ఆ వార్తపై మీడియాకు బహిరంగ లేఖ రాశారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తకు ఖండన ప్రచురించాలని డిమాండ్ చేశారు. 

తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల విషయం తనకు కాస్తా ఆలస్యంగా చేరిందని, ఇంతటి సత్యదూరమైన వార్తను ఏ విధమైన ఆధారం లేకుండా బాధ్యతారహితంగా ప్రచురించారని కడియం అన్నారు.

కడియం శ్రీహరి రాసిన బహిరంగ లేఖ ఇదీ...
 
రాజకీయ వారసత్వం, కోట్లాది రూపాయల సంపదలు కలిగిన కుటుంబం నాది కాదని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో నిజాయితీ, సమర్ధత, విలువలే పెట్టుబడిగా కొనసాగుతున్నాను. నాలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాడిని మీడియా ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి.
నాకు బిజెపీలో చేరే ఆలోచన కానీ, అవసరం కానీ లేదన్న విషయాన్ని మీ, మీ మీడియా ద్వారా సమాజానికి తెలపాలి. లేదంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నాను.
    
     
ప్రజలారా, మీడియా మిత్రులారా...

నేను సమాజంలో అట్టడుగు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఉన్నతవిద్య చదివి లెక్చరర్ గా పనిచేస్తున్న కాలంలోనే నాకు రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాను. వాటికి వన్నె తెచ్చాను.
 రాజకీయాల్లో అనేక అద్భుత సందర్భాలను, క్లిష్టకాలాలను మరియు ఒడిదుడికులను చూసిన వాడిని. 

ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపర్చి, బదనాం చేసే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థపర శక్తులు వారి వ్యక్తిత్వాన్ని, అవకాశాలను దెబ్బతీసేవిధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాయి.
 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరియు ఇప్పుడు పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. దీనిని గమనించాల్సిందిగా ప్రజలను, మీడియాను కోరుతున్నాను. 

  

ఒకే ఒక్క మాట.. 
రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారాల్సిన అవసరం కానీ, పదవుల కోసం పాకులాడాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు. అవినీతి, అక్రమాలను పెంచి పోషించి, విలువలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏనాడు ఓటు వేయలేదు. 

నేను అంబేద్కర్ వాదిని. వామపక్ష భావజాలంతో పెరిగిన వ్యక్తిని. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు దూరంగా ఉండే వ్యక్తిని. అందులోనూ దళిత, ముస్లిం మరియు క్రైస్తవ వ్యతిరేకమైన,  సిద్ధాంతపరంగా  విబేధించే బిజిపిలోకి వెళ్లే దుస్థితి లేనే లేదు. 
    

యావత్తు తెలంగాణ ప్రజానీకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మద్దతు తెలుపుతున్నారు. దేశం మొత్తం కేసిఆర్ గారి వైపు చూస్తోంది. కేసిఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా నిలవబోతోంది. కేసిఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో నావంతు బాధ్యతను నిర్వర్తిస్తాను.  
    
              
ఇట్లు

కడియం శ్రీహరి

ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రం.

Follow Us:
Download App:
  • android
  • ios