పార్టీ మారనున్న కడియం శ్రీహరి..?
తాను టీఆర్ఎస్ను వీడుతున్నానని తప్పుడు ప్రచా రం జరుగుతోందని, అలాంటి వాటిని ప్రజలు, మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పార్టీ మారనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వెలువుడుతున్నాయి. కాగా.. దీనిపై కడియం క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, నైతిక విలువలు, నీతి నిజాయితీలే పెట్టుబడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని టీఆర్ఎస్ నేత, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ అధినే కేసీఆర్ మాటే తనకు శిరోధార్యం అని అన్నారు.
ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సోషల్ మీడియాలో తాను టీఆర్ఎస్ను వీడుతున్నానని తప్పుడు ప్రచా రం జరుగుతోందని, అలాంటి వాటిని ప్రజలు, మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని చెప్పారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు త్వరలో సమసిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ వద్ద స్టేషన్ఘన్పూర్కు చెందిన అసమ్మతి నేతలు భేటీ అవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో మార్పుండదని పేర్కొన్నారు. విభిన్న సిద్ధాంతాలతో ఏర్పడుతున్న మహా కూటమి త్వరలోనే కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు.