కొత్త రెవిన్యూ చట్టంపై కేసీఆర్ ప్లాన్ ఇదీ....
కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నారని సమాచారం.
హైదరాబాద్:కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడాన్ని మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా చెబుతున్నారు.
కొత్త రెవిన్యూ చట్టంలో కీలక అంశాలను పొందుపర్చాలని సీఎం భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. రెవిన్యూ శాఖను రద్దు చేస్తారనే ప్రచారం కూడ ఉంది. ఇటీవలనే ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది.దీంతో కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారని సీఎం కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.
ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత రెండు దఫాలు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. గత నెల 26వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో రెవిన్యూ చట్టం గురించి చర్చిస్తారని భావించారు. కానీ, ఆ సమావేశంలో రెవిన్యూ చట్టం గురించి వదిలేసి ఆర్టీసీ కార్మికుల కోసం చర్చించారు.
ఈ నెల 11వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి చర్చించారు. కేంద్రం నుండి పన్నుల వసూలు తదితర విషయాలపై చర్చించారు.
పే రివిజన్ కమిషన్ ప్రయోజనాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సి ఉంది.కానీ ఈ కారణాలతో కూడ రెవిన్యూ చట్టం తీసుకు రాకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా ప్రచారంలో ఉంది.
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులతో ఈ నెల 1వ తేదీన కేసీఆర్ సమావేశం నిర్వహించి వరాలు ప్రకటించారు.
సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు కొంత విమర్శల పాలైంది. దీంతోనే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం వరాలు కురిపించినట్టుగా చెబుతున్నారు.
ఇదే సమయంలో కొత్త రెవిన్యూ చట్టం తీసుకువస్తే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే కొత్త రెవిన్యూ చట్టాన్ని కేసీఆర్ తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
పే రివిజన్ కమిషన్ ప్రయోజనాలను ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా సీఎం కేసీఆర్ సరైన సమయంలో కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.