హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్
కొలీజియం సిపార్సును ఆమోదించిన రాష్ట్రపతి...
హైదరాబాద్ లోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్ నియమితులయ్యారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ను హైదరాబాద్ హైకోర్టు కు బదిలీ చేశారు. రాధాకృష్ణన్ నియామక ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సుల మేరకు జస్టిస్ రాధాకృష్ణన్ ని హైదరాబాద్ సీజే గా రాష్ట్రపతి నియమించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్ స్థానంలో పూర్తిస్థాయి సిజె నియామకం జరిగింది. ఈనెల 16 లోపు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేరళ లోని కొల్లాం జిల్లాకు చెందిన ఓ న్యాయవాద కుటుంబంలోనే రాధాకృష్ణన్ జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులే. ఇందువల్లే ఈయన కూడా న్యాయవాద వృత్తివైపు మళ్లారు. ఈయన బెంగళూరు విశ్వవిద్యాలయం లో ఎల్ఎల్బీ చదివారు. 2004 లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బదిలీఅయ్యారు.