సీఎల్పీ నేత మల్లు  భట్టి విక్రమార్కతో‌ మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని భట్టి నివాసానికి వచ్చిన జూపల్లి కృష్ణారావు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. 

హైదరాబాద్‌: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో‌ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని భట్టి నివాసానికి వచ్చిన జూపల్లి కృష్ణారావు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి కృష్ణారావు.. ఇందుకు సంబంధించి భట్టి విక్రమార్క‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసే సభ, ఇతర నేతల చేరికపై చర్చించినట్టుగా సమాచారం. అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడు.. కొల్లాపూర్‌‌లో జరిగే బహిరంగ సభకు ఆహ్వానించడం కోసం ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు. 

సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి నేతలు సమావేశం కావడం జరిగిందని.. వారంతా కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు.

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరికను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆయన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. మాటలు చెప్పే ప్రధాని మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపరుడైతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొల్లాపూరులో జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించిన తేదీలను ఏఐసీసీ పెద్దలు తేదీని ప్రకటిస్తారని చెప్పారు.