కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శించిన జీవన్ రెడ్డి తెలంగాణ  సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  కాంగ్రెస్‌ను బాధ్యులను చేయడం తగదన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ అబద్దాలకు ఆయన ముక్కు నేలకు రాయాల్సి వస్తే ముక్కు ఏనాడో అరిగిపోయేదని ఎద్దేవా చేశారు. సీఏం తన హుందాతనాన్ని మరిచి మాట్లాడితే తాము కూడా అదే బాటలో నడవాల్సి వస్తుందన్నారు. తమ సహనాన్ని కేసీఆర్ చేతకాని తనంగా భావిస్తున్నారని, వెకిలి మాటలు ఆపకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. 
 కేసీఆర్ కి చట్టాలపై అవగాహన తేక న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్‌ను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. ఆయనేమీ రాజ్యాంగానికి మినహాయింపు కాదన్నారు. రాజ్యాంగబద్దమైన కోర్టులను, వాటి తీర్పులను దిక్కరించేటట్లు ఆయన మాట్లాడటం తగదని సలహా ఇచ్చారు.
 ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వంమే తమను దోషులుగా చిత్రీకరిస్తూ మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ జాప్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. ఇలా మాటలతో ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవడం తమకు రాదని విమర్శించారు. అహంకారపూరిత మాటలే కేసీఆర్‌ను గద్దె దించుతాయని జీవన్‌రెడ్డి తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred