వెలుగులోకి జయ ఇన్ఫ్రా అక్రమాలు : 50 ప్రాజెక్ట్లు, సెలబ్రెటీలతో ఓపెనింగ్స్.. 100 కోట్లు టోకరా
జయ ఇన్ఫ్రా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జయ ఇన్ఫ్రా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
జయ ఇన్ఫ్రా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ల పేరుతో ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. ఇప్పటి వరకు 50 ప్రాజెక్ట్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్రీ లాంచ్ ఆఫర్తో పాటు ఫ్లాట్ అప్పగించేందుకు వడ్డీ పేరుతో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఎన్ఆర్ఐలను కూడా పెద్ద మొత్తంలో మోసం చేసింది జయ ఇన్ఫ్రా.
వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రాజెక్ట్లను ప్రారంభించాడు నిందితుడు కాకర్ల శ్రీనివాస్. సెలబ్రెటీలతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారిని ఆకర్షించాడు. మరోవైపు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు బాధితులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. కాకర్ల శ్రీనివాస్ను తిరిగి కస్టడీలోకి తీసుకుంటామని..ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్ట్లపైనా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. జయ ఇన్ఫ్రా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారించారు.
ప్రీ లాంచ్ పేరుతో 100 కోట్లు టోకరా వేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 50కి పైగా వెంచర్లు వేసింది ఈ సంస్థ. కూకట్పల్లి, పటాన్ చెరు, చందానగర్లో కమర్షియల్ వెంచర్లు వేసింది. ఫ్లాట్ అప్పగించే వరకు పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి.. 3 నుంచి 4 నెలల పాటు వడ్డీ చెల్లించిన తర్వాత దానిని నిలిపివేసేవారు నిర్వాహకులు. అందమైన ప్రకటనతో ఎన్ఆర్ఐలను బుట్టలో వేసుకున్నాడు కాకర్ల శ్రీనివాస్. దీంతో మోసపోయామంటూ కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఎన్ఆర్ఐలు. షాబాద్, మహేశ్వరం, కందుకూరు, షాద్ నగర్లలో ల్యాండ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జేపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు కాకర్ల శ్రీనివాస్. కాకర్ల, అతని సోదరుడు కలిసి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కాకర్లను అరెస్ట్ చేయగా, అతని సోదరుడి కోసం గాలిస్తున్నారు.