డిప్యూటీ సిఎం కడియం పై జనగామ జర్నలిస్టులు ఫైర్
బాధతోనే జర్నలిస్టుల తీవ్ర నిర్ణయం
జనగామ : తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి జనగామలో జర్నలిస్టులు షాక్ ఇచ్చారు. జర్నలిస్టుల మనోభావాలు గాయపడేలా కడియం వ్యవహరించారని జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. కడియం తీరును ఎండగట్టడమే కాకుండా నిరసన వ్యక్తం చేశారు. వివరాలు చదవండి.
జనగామలోని గాయత్రి గార్డెన్ లో జరుగుతున్న రైతు బందు సమీక్షా సమావేశానికి హాజరైన విలేకరులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో విలేకరులు నిరసన వక్తం చేశారు. ఈ క్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వచ్చి జర్నలిస్టులతో మాట్లాడుతున్నారు. వారిని సముదాయించే ప్రతయ్నం చేస్తున్నారు.
కానీ డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి అసహనంతో విలేకరులపై విసుగు ప్రదర్శించారు. ‘‘మీడియా వాళ్లు షో చేస్తున్నారు... వాళ్లు వస్తే రాని.. లేదంటే నువ్వు మాత్రం వేదికపైకి రావే..’’ అంటూ మాట్లాడారు. జర్నలిస్టుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు మీడియా వాళ్లు.
అంతేకాదు తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేమంటే? ఇప్పటి నుండి జనగామలో డిప్యూటీ సీఎం హాజరయ్యే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వెళ్లకూడదని జనగామ జర్నలిస్టులు నిర్ణయం తీసుకున్నారు.