హైదరాబాద్లో త్వరలో జనసేన కార్యాలయం.. తెలంగాణలోనూ తిరుగుతా : పవన్ కల్యాణ్
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చిందని, తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని ఆయన గుర్తుచేశారు. ఇకపై తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పవన్ తెలిపారు.
తెలంగాణకు నవ నాయకత్వమే మార్గమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ ఆర్ధిక సాయం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మార్పు ఖచ్చితంగా అవసరమన్నారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ బాధ్యతతోనే తెలంగాణలోనూ రాజకీయాలు చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఎన్ని స్థానాల్లో పోటీ... ఎవరితో కలిసి పోటీ అనేది త్వరలోనే చెబుతానని ఆయన పేర్కొన్నారు. తాను ఓడినా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తానని జనసేనాని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే మొదలుపెట్టానని పవన్ తెలిపారు. ఓడిపోయాను కాబట్టి మరింత బాధ్యత, అనుభవం వచ్చిందని.. ఇకపై ప్రతి నియోజకవర్గంలో జనసేన నాయకులు పర్యటిస్తారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ప్రత్యేక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని .. 20 ఏళ్ల భవిష్యత్ అని తాను ఊరికే అనను అన్నారు.
అంతకుముందు నల్గొండ జిల్లా Choutuppal మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తన పర్యటనలో భాగంగా సైదులు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల చెక్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పటిష్టతపై కంద్రీకరించనున్నట్టుగా పవన్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులే కీలక పాత్ర పోషించారని Jana Sena చీఫ్ అన్నారు. Telangana రాజకీయాల్లో కూడా విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని కూడా ఆయన కోరారు.
తెలంగాణలో జనసేన జెండా ఎగరాలని .. యువత బలం జనసేనకు ప్రధాన ఆయుధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో తమకు 5 వేల ఓట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.