ప్రభుత్వ తీరు అప్రజాస్వామికంగా ఉంది: జానారెడ్డి
టిఆర్ఎస్ పై జానా తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలని సిఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించకపోతే దేశానికి చాటిచెప్పేలా తమ నిరసనను కొననసాగిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాలను పునరుద్దించాలని స్పీకర్ మధుసూధనాచారికి సోమవారం నాడు వినతి పత్రం సమర్పించిన తర్వాత సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ విరుద్దంగా, అప్రజాస్వామికంగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారని ఆయన చెప్పారు. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లు కూడ తమ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పు విడుదల చేసి 50 రోజులు దాటినా కానీ ప్రభుత్వం, అసెంబ్లీ తమ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించకపోవడంపై ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన చెప్పారు.
కోర్టు తీర్పును అమలు చేయకపోతే దేశానికి చాటిచెప్పే విధంగా తమ నిరసనను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.