జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరు జనశక్తి గ్రూప్ కోసం యువకులను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్లుగా జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.
జనశక్తి మావోయిస్ట్ పార్టీని (janashakti maoists) బలోపేతం చేసేందుకు యువకులను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న ముగ్గురు నక్సలైట్లను జగిత్యాల జిల్లా (jagtial district) కోరుట్ల (korutla ) పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోనరావుపేట క్రాసింగ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ (sindhu sharma ips) మీడియాకు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజమాబాద్ జిల్లాలో యువకులను జనశక్తి పార్టీలోకి చేర్చడం, వారికి ఆయుధాలు, మందు గుండు సామగ్రి అందించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు.
వీరంతా జనశక్తి నేత కూర రాజన్న నేతృత్వంలో పని చేస్తున్నారన్నారని తెలిపారు. అతని ఆదేశాలతో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారని సింధూ శర్మ చెప్పారు. పట్టుబడిన వారిలో పొహునుక సురేందర్ అలియాస్ వంజర సురేందర్ అలియాస్ సురేష్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ పిఎస్పి రెడ్డి (కుమ్మర్పల్లి గ్రామం, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా), చెట్టి రాజేవర్ (గ్రామం విద్యాపూరి, జగిత్యాల జిల్లా), నగునురి రవీందర్ (రామన్నపల్లి గ్రామం, సిరిసిల్ల జిల్లా)కి చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
వీరిలో సురేందర్ అనే జనశక్తి సభ్యుడు 2013లో వేములవాడ ప్రాంతంలో ప్రభాకర్ రావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆమె తెలిపారు. హత్య చేసిన తర్వాత పేరు మార్చుకొని ముంబై పారిపోయి అక్కడి నుండి హైదరాబాద్, సంధ్యానగర్, బండ్లగూడ ప్రాంతాల్లో పిఎస్పీ రెడ్డి అనే పేరు తో ఫేక్ ఐడి కార్డులు చేయించుకోని తిరిగినట్లు సింధూ శర్మ చెప్పారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో జనశక్తి మావోయిస్టులు సమావేశం పెట్టినట్లు ప్రచారం చేసింది వీరేనని ఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుండి నాలుగు తుపాకులు, మూడు తపంచాలు, 299 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
