రేవంత్తో ఎర్ర శేఖర్ భేటీ: కాంగ్రెస్ చీఫ్ తో పాత టీడీపీ నేతల సమావేశం, ఏం జరుగుతోంది?
గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణరావులు మంగళవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఎర్రశేఖర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.గండ్ర సత్యనారాయణరావు టీఆర్ఎస్ లో ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పలువురు నేతల తమ రాజకీయ భవిష్యత్తు కోసం జంపింగ్ లకు తెర తీస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన నేతలు రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు.
&n
bsp;
బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంగళవారం నాడు భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్ గతంలో రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం బుజ్జగింపులతో ఆయన తిరిగి ఈ పదవిలో కొనసాగుతున్నారు.
ఎర్రశేఖర్ గతంలో టీడీపీ నుండి జడ్చర్ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ మహభూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ నుండి ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత స్థానిక బీజేపీ నేతలతో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డితో ఎర్రశేఖర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
మరో వైపు టీఆర్ఎస్ లో చేరిన మాజీ టీడీపీ నేత గండ్ర సత్యనారాయణరావు కూడ ఎర్ర శేఖర్ తో కలిసి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గండ్ర సత్యనారాయణరావు టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డితో సత్యనారాయణ రావు భేటీ కావడం చర్చకు దారి తీసింది.