ఇంటర్ ఫలితాల వివాదం: మరో విద్యార్థిని ఆత్మహత్య
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది.
చేవెళ్ల: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షాబాద్ మండలం తిరుమలాపూర్కు చెందిన జ్యోతి అనే విద్యార్థిని చేవెళ్ళలోని వివేకానంద జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది.
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది.
ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఇంటర్ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. వారికి అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు.
పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది.
అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపాల్సిన చర్యలు కానరావడం లేదు. ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికార వర్గాల అంచనా.