తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం జగన్ హల్ చల్
గతంలో కాంగ్రెస్ నేతలు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రావొద్దంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని తాజాగా జగన్ ను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ నేతలు దిగజారుస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైయస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం వైయస్ జగన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. వైయస్ జగన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టకు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించొద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గతంలో కాంగ్రెస్ నేతలు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రావొద్దంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని తాజాగా జగన్ ను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ నేతలు దిగజారుస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ను రావొద్దనడం కాంగ్రెస్ కుటిలనీతికి అద్దంపడుతుందన్నారు. మోదీని మిషన్ భగీరథ ప్రారంభానికి రావొద్దని లేఖ రాసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ మోదీ ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ వెళ్లడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టగలరా అంటూ నిలదీశారు.
కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ నీటిని వాడుకోవద్దని కార్యకర్తలకు పిలుపునిస్తారా అంటూ కర్నె ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కడిగిపారేశారు. తెలుగురాష్ట్రాల మధ్య సఖ్యత మరింత పెరుగేందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని ఆ అంశాన్ని కూడా రాజకీయం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.