సీఎల్పీ సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
తెలంగాణలోని సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకొంది.ఆదివారం నాడు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ సమావేశం జరిగింది.
హైదరాబాద్:తెలంగాణలోని సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకొంది.ఆదివారం నాడు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులు, పోతిరెడ్డిపాడుపై ఈ సమావేశంలో చర్చించారు.
సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కరోనాపై చర్చ సాగింది.
కరోనా టెస్టులు చేయించుకోవాలని సోదరుడు రాజగోపాల్ రెడ్డిని కోరారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ను కలిసి వచ్చినందున టెస్టులు తప్పనిసరని ఆయన చెప్పారు. అయితే సోదరుడు చేసిన సూచనపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కరోనా టెస్టులు చేయించుకొన్నానని ఎలాంటి సమస్యలు లేవని ఆయన వివరించారు.
మరో వైపు ఈ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరదాగా వ్యాఖ్యలు చేశారు. జగ్గన్న... గడ్డాలు.. మీసాలు బాగా పెంచడంతో మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండాపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.
సీఎల్పీ తరపున కోవిడ్ ఆసుపత్రులను సందర్శించాల్సిన అవసరం ఉందని మరికొందరు ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడుపై ఆలస్యం చేయవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ విషయమై రాష్ట్ర బంద్ లేదా నిరసన కార్యక్రమం చేయాలని కోరారు.