కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
కరోనా నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసింది ప్రభుత్వం. సెకండియర్ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసింది ప్రభుత్వం. సెకండియర్ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇంటర్ సెకండ్ ఇయర్తో పాటు, వొకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. కరోనా కేసుల సంఖ్య తగ్గిన తర్వాత పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది ప్రభుత్వం.ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటూ గతంలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాయిదా వేసింది. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో సమీక్షా సమావేశం నిర్వహించి.. పరీక్షల తేదీని ఎగ్జామ్స్ నిర్వహణకు 15 రోజుల ముందు ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని బోర్డు ప్రకటన జారీ చేసింది.రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ను అమలు చేస్తోంది. లాక్ డౌన్ అమలు తర్వాత కరోనా కేసులు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖాధికారులు గణాంకాలు చెబుతున్నాయి.