తెలంగాణ ఇంటర్ వివాదం: మంచు మనోజ్ కు ప్రశంసలు, మోహన్ బాబుపై విమర్శలు
చదువు అనేది జ్ఞానం కోసం, భవిత కోసం అంతేగానీ ఆడంబరం కోసం కాద’ని ట్వీట్ చేశారు.మేమంతా మీతోనే ఉన్నాం.. మీరు భయపడొద్దు. అధికారుల సూచనలను పాటించండని ఆయన విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు. మంచు మనోజ్ ను పొగుడుతున్న నెటిజన్లు మెహన్ బాబును మాత్రం వదలడం లేదు.
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల మరణాలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, మార్కులు రాలేదని కొందరు, ఫెయిల్ అయ్యామనే మనో వేదనతో ఇంకొందరు ఇలా సుమారు 17 మంది వరకు ప్రాణాలొదిలారు.
వ్యవస్థ చేసిన పొరపాటుతో విద్యార్థులు ఆందోళన చెంది మరణశాసనం రాసుకుంటుంటే సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు మన భవిత, మన ఆశ, శ్వాస విద్యార్థులే అంటూ సినీ డైలాగులు కొట్టే సినీ ప్రముఖులు స్పందించకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నేతలు రాజకీయాల్లోకి రావడం తీవ్ర విమర్శలు చేసిన వారి ఫోటోలను పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే ఒక సామాజిక బాధ్యతగా స్పందించరా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేవలం హీరో మంచు మనోజ్ మాత్రమే స్పందించారని ఆయన గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మంచు మనోజ్ ఘాటు వ్యాఖ్యలను సైతం ప్రస్తావిస్తున్నారు.
ఇంటర్ బోర్డు తప్పిదాలు, బాధ్యతా రాహిత్యం కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మనోజ్ విమర్శించిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నారు. ఇలాంటి ఘటనలకు బాధ్యులెవరు? ఆత్మహత్యలను ఆపేదెవరు? అని ఆయన ట్వీట్ చేశారు.
బలవన్మరణాలకు ఒడిగడుతున్న విద్యార్థులు మన భవిత, మన ఆశ అన్న మనోజ్.. పరీక్షలే జీవితం కాదన్నారు. మరో ఆలోచన లేకుండా ప్రాణాలు తీసుకునేలా విద్యార్థులపై ఒత్తిడి పెంచడాన్ని ఆయన ఖండించారు. ఇంటర్ బోర్డు బాధ్యతారాహిత్యం వల్లే విద్యార్థులు బలవుతున్నారని తెలిసి తీవ్రంగా కలత చెందాను.
ఒకప్పుడు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల శాడిజం, మార్కుల కోసం ఒత్తిడి చేయడంతో భరించలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఇంటర్ బోర్డు కారణంగా వారు ఉసురు తీసుకుంటున్నార’ని మనోజ్ మండిపడ్డారు. ఫెయిలైనా మీ పిల్లలకు అండగా నిలవండి.
ఒత్తిడి దరి చేరకుండా చూడండని మనోజ్ విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. విజయం సాధించినప్పుడు వారికి మీ ప్రేమ అక్కర్లేదు. ఎందుకంటే గెలిచినప్పుడు ప్రపంచమంతా వారిని ప్రేమిస్తుంది. కానీ విఫలమైనప్పుడే వారికి మీ ప్రేమ అవసరం. జీవితం ఎంతో చిన్నది, ఆత్మీయుల అండతో ఆటంకాలను అధిగమించొచ్చని ఆయన సూచించారు.
‘టైం వేస్టయ్యింది, డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడొద్దు. ప్రతిదీ ఓ అనుభవమే. అందరికీ న్యాయం చేస్తానని కేటీఆర్ మాటిచ్చారు. ఆయన న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఓ చిన్న ట్వీట్కే ఆయన స్పందించారు. ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న కాలేజీల పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ను కోరుతున్నాను.
చదువు అనేది జ్ఞానం కోసం, భవిత కోసం అంతేగానీ ఆడంబరం కోసం కాద’ని ట్వీట్ చేశారు.మేమంతా మీతోనే ఉన్నాం.. మీరు భయపడొద్దు. అధికారుల సూచనలను పాటించండని ఆయన విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు. మంచు మనోజ్ ను పొగుడుతున్న నెటిజన్లు మెహన్ బాబును మాత్రం వదలడం లేదు.
ఫీజు రీయింబర్స్ మెంట్ పై పోరాటం చేసిన మోహన్ బాబు 17 మందికి పైగా విద్యార్థులు మరణిస్తే వారిని ఓదార్చాలని అనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు నాగబాబు, శ్రీరెడ్డిలాంటి వారు ఆచి తూచి స్పందించారు.
కానీ విద్యార్థులను, యువతను ప్రభావితం చేసే నటులు స్పందించి వారికి భరోసా ఇప్పిస్తే బాగుంటుందని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చూసుకుంటే మంచు మనోజ్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.